పచారీ కొట్టుకెళ్లిన యువకుడు.. భార్యతో ఇంటికొచ్చాడు.. ఎక్కడ?

గురువారం, 30 ఏప్రియల్ 2020 (11:59 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. ఈ వైరస్ బారిన తమ ప్రజలు పడకుండా ఉండేందుకు దేశాలన్ని లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే, ఈ లాక్‌డౌన్ అనేక కష్టాలకు కారణమైంది. ముఖ్యంగా, ప్రేమికులు, వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారికి మరింత కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడి తల్లి వినతి మేరకు కిరాణా షాపుకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చేటపుడు మాత్రం అతను కిరాణా సరుకుల సంగతి దేవుడెరుగ.. కట్టుకున్న భార్యను మాత్రం తీసుకొచ్చాడు. లాక్‌డౌన్ సమయంలో తన కుమారుడు చేసిన పనికి నిర్ఘాంతపోయి ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. అస్సలు ఈ పెళ్లిని తాను అంగీకరించబోనని, ఆ యువతి కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఠాణాలో భీష్మించుకుకూర్చొంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన గుడ్డూ అనే యువకుడు ఈ లాక్‌డౌన్‌కు ముందే ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అదీ కూడా హరిద్వార్‌లోని ఆర్యసమాజంలో ఈ వివాహం జరిగింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆ తర్వాత తమ సొంతూరుకు భార్యను ఢిల్లీకి తీసుకొచ్చి ఓ అద్దె ఇంటిలో ఉంచాడు. అప్పటివరకు గుట్టుచప్పుడు కాకుండా సాగుతూ వచ్చిన వారి వివాహ బంధం కరోనా వైరస్ దెబ్బకు బయటపడింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఇంటిని ఖాళీ చేయాలని యజమాని బలవంతం చేశాడు. ఈ విషయాన్ని భర్త గుడ్డూకు భార్య చేరవేసింది. 
 
ఈ పరిస్థితుల్లో ఇటీవల గుడ్డూ తల్లి, కొట్టుకెళ్లి పచారీ సరుకులు తీసుకురావాలని కోరింది. ఇదేఅదనుగా, ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను గుడ్డూ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తాను వివాహం చేసుకున్న సవితను వెంటేసుకుని ఇంటికి వచ్చాడు. దీంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తల్లి, సవితను ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ, పోలీసులను ఆశ్రయించింది. 
 
మొత్తం విషయం విని ఆశ్చర్యపోయిన వారు, లాక్ డౌన్ ముగిసేంత వరకూ సవితను ఢిల్లీలోని అద్దె ఇంట్లోనే ఉండాలని కోరి, ఆ మేరకు ఇంటి యజమానిని ఒప్పించారు. లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఈ కేసును తేలుస్తామని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు