తమిళనాడు కొత్త చిచ్చు : తెరపైకి రెండో రాజధాని!

మంగళవారం, 18 ఆగస్టు 2020 (14:33 IST)
తమిళనాడు రాష్ట్రంలో కొత్త చిచ్చు రేగింది. తెరపైకి రెండో రాజధాని అంశం వచ్చింది. అధికార అన్నాడీఎంకేకు చెందిన ఇద్దరు మంత్రులే ఈ అంశాన్ని రేపారు. చెన్నై నగరంలో జనాభాతో పాటు.. పారిశ్రామికరంగం కూడా బాగా అభివృద్ధి చెందిందని, అందువల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న మదురైను రెండో రాజధానిగా చేయాలని రాష్ట్ర మంత్రులు ఆర్.బి. ఉదయ్ కుమార్, సెల్లూరు రాజులు డిమాండ్ చేస్తున్నారు. పైగా, ఈ ప్రతిపాదన తమది కాదనీ, గతంలో తమ పార్టీ వ్యవస్థాపకుడైన స్వర్గీయ డాక్టర్ ఎంజీ రామచంద్రన్‌ అప్పట్లోనే ప్రతిపాదించారని, దాన్ని డీఎంకే అధినేత ఎం కరుణానిధి అడ్డుకున్నారని వారు సెలవిస్తున్నారు. 
 
తాజాగా మదురైలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర  మంత్రి సెల్లూరు రాజు పాల్గొని మాట్లాడుతూ, మదురై నగరంలోనే ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయని, అప్పట్లో మహాసభలు కూడా ఇక్కడే జరిగేవని అన్నారు. ఎంజీఆర్ హయాంలో ప్రపంచ తమిళ మహా సభలు కూడా ఇక్కడ జరిగాయని చెప్పారు. దివంగత సీఎం జయలలిత సైతం ఎన్నో కీలకమైన నిర్ణయాలను మదురైలోనే ప్రకటించారని చెప్పారు. తక్షణమే సీఎం స్పందించి, రెండో రాజధాని ఏర్పాటుపై ఓ కమిటీని వేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇకపోతే, సోమవారం ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రెవెన్యూ మంత్రి ఉదయ్ కుమార్, చెన్నై విస్తరణను ప్రస్తావిస్తూ, రోజురోజుకూ జనాభా పెరుగుతోందని, నగరం చుట్టూ పరిశ్రమలు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలకూ దాదాపు సమానదూరంలో ఉండే మధురైని రెండో రాజధానిగా చేయడం మినహా మరో మార్గం లేదని అన్నారు. సెకండ్ క్యాపిటల్ సాధ్యాసాధ్యాలను పరిశీలించే కమిటీ ఏర్పాటుకు పళనిస్వామి చర్యలు చేపట్టాలని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు