గణపతి తల ఖరీదు కోటి రూపాయలు

శుక్రవారం, 22 ఆగస్టు 2014 (11:59 IST)
మావోయిస్టు పార్టీ సారథి గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు (65) తలకు వెల భారీగా పెరిగింది. మూడు దశాబ్దాలకు పైగా వామపక్ష తీవ్రవాదానికి దళపతిగా కొనసాగుతున్న ఆయనపై మహారాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల వెలను ప్రకటించింది. 
 
1992లో పీపుల్స్‌వార్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన కాలంలో గణపతిపై రూ.19 లక్షల వెల ఉండేది. ఆయన స్వస్థలం కరీంనగర్‌ జిల్లా బీర్బూమ్‌లో చోటుచేసుకున్న భూస్వాముల హత్యలు, పోలీసుల వధలకు సంబంధించిన కేసుల్లో గణపతి ప్రధాన నిందితుడు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఆయనపై అంత మొత్తం రివార్డు ప్రకటించింది. 
 
2005లో మావోయిస్టు పార్టీ సారథ్యం తీసుకునే సమయానికి ఆయన తలపై అరకోటి రివార్డు ఉండేది. అల్‌ఖైదా, హిజ్బూల్‌, లష్కరే ఉగ్రవాదులతో సమానంగా.. గణపతిని పోల్చి ఈ మొతాన్ని కేంద్రం ఖరారు చేసింది. ఇప్పుడు దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం ఆయన జాడ గురించి చిన్న క్లూ ఇచ్చినా ఆ మొత్తాన్ని ఇచ్చేస్తామని ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి