మహారాష్ట్రలో 2వేల బ్లాక్ ఫంగస్ కేసులు.. అక్కడ కూడా..?

బుధవారం, 12 మే 2021 (21:10 IST)
దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ కరోనా బాధితులను బ్లాక్‌ఫంగస్‌ వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 
 
ఇక మహారాష్ట్రలోనూ దాదాపు 2వేలకు పైగా బ్లాక్‌ఫంగస్‌ కేసులు ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ముందుజాగ్రత్తగా అక్కడి మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను ప్రత్యేక చికిత్స కేంద్రాలుగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది.
 
'ఇప్పటివరకు రాష్ట్రంలో 2వేలకు పైగా బ్లాక్‌ఫంగస్‌ బాధితులు ఉండవచ్చు. కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్‌ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తాం' అని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే పేర్కొన్నారు. ఈ బాధితులకు పలు విభాగాల చికిత్స అవసరం అవుతున్నందున ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
 
మ్యూకోర్‌మైకోసిస్‌ బాధితులకు ఈఎన్‌టీ, కంటి చూపు, న్యూరో వైద్యుల సహాయం అవసరమవుతుందని రాజేష్‌ తోపే పేర్కొన్నారు. ఇలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వ పథకం మహాత్మ పూలే జన్‌ ఆరోగ్య యోజన కింద చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ చికిత్సకు వినియోగించే ఔషధాలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవని అన్నారు. 
 
అందుచేత వీటి ధర తగ్గించాలని కోరుతూ జాతీయ ఫార్మా ధరల సంస్థకు లేఖ రాస్తున్నట్లు మంత్రి చెప్పారు. బ్లాక్‌ఫంగస్‌ బాధితుల చికిత్సకు ఆంఫోటెర్సిన్‌-బీ ఇంజక్షన్‌ అవసరం అవుతున్నందున ముందుజాగ్రత్త చర్యగా ఓ లక్ష ఇంజక్షన్లను అందుబాటులోకి తెచ్చేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు