ట్రాన్స్ జెండర్స్‌కి ఉచిత విద్య.. పాఠశాల ఏర్పాటు

మంగళవారం, 29 జూన్ 2021 (15:28 IST)
Transgender
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో ట్రాన్స్ జెండర్స్‌కి ఉచిత విద్యను అందించేందుకు పాఠశాలను ఏర్పాటు చేశారు. ట్రాన్స్ జెండర్స్ సమాజంలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. వారు ఎక్కడికైనా వెళ్లి చదువుకోవాలి అంటే అనేక రకాల ఇబ్బందులు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఓ ఎన్జీవో ముందుకు వచ్చి వీరి కోసం పాఠశాలను నిర్మించింది. ఇక ఇప్పటి వరకు ఈ పాఠశాలలో పెద్దలు, పిల్లలు కలిసి 25 మంది జాయిన్ అయినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.
 
ఇక ఈ విషయంపై ట్రాన్స్ జండర్స్ మీడియాతో మాట్లాడారు. తమకు చదువుకోవాలని ఉన్నా పాఠశాలకు వెళ్లలేకపోతున్నామని, తమకు పాటలు చెప్పేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలిపారు. తమ బాధలని ఓ ఎన్జీవోకి తెలిపామని వారు తమకోసం పాఠశాల ఏర్పాటు చేశారని వివరించారు. ఈ పాఠశాలలో వయసుతో సంబంధం లేకుండా ట్రాన్స్ జెండర్స్ ఎవరైనా వచ్చి చదువుకోవచ్చని తెలిపారు.
 
ఎన్జీవో వ్యవస్థాపకులు, చైర్‌పర్సన్ రేఖా త్రిపాఠి మాట్లాడుతూ.. లింగభేదం లేకుండా అందరికి విద్యను అందించాలని తెలిపారు. ఆలా అందించినప్పుడే సమాజంలో అందరికి గౌరవం దక్కుతుందని తెలిపారు. చాలా చోట్ల ట్రాన్స్ జెండర్స్‌ని పాఠశాలలోకి రానివ్వడం లేదని వారిని చిన్న చూపుచూస్తున్నారని తెలిపారు. ఇకపై అనేక చోట్ల ఇటువంటి పాఠశాలలు ప్రారంభిస్తామని వివరించారు. ప్రభుత్వాలు వారికోసం పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు.

వెబ్దునియా పై చదవండి