బీజేపీకి మమతా బెనర్జీ షాక్

శనివారం, 10 జులై 2021 (07:12 IST)
అధికార తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి ‘టెక్నికల్’ షాక్ ఇచ్చారు. బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించి, తిరిగి సొంతగూటికి చేరిన ముకుల్ రాయ్‌కు కీలక పదవిని అప్పజెప్పారు.పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌ (పీఏసీ) గా ముకుల్ రాయ్‌ను నియమిస్తూ సీఎం బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు.

ఈయన నియామకాన్ని అసెంబ్లీ స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ కూడా ఆమోదం తెలిపారు. వాస్తవానికి పీఏసీ చైర్మన్ ప్రతిపక్ష నేతకు ఇవ్వడం అన్ని రాజకీయ పక్షాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఈ ఒకే ఒక్క వ్యూహంతో సీఎం మమత బీజేపీని ఇరుకున పెట్టారు.

టెక్నికల్‌గా ముకుల్ రాయ్ ఇంకా బీజేపీ ఎమ్మెల్యేయే. ప్రతిపక్ష నేతకు ఇవ్వాలన్న సంప్రదాయాన్ని తాము పాటించినట్లూ జరిగింది. అదే సమయంలో తమ పార్టీకే చెందిన ముకుల్ రాయ్‌‌కే ఈ పదవి ఇచ్చినట్లైంది. ఈ వ్యూహంతో బీజేపీ ఇరుకునపడినట్లేనని తృణమూల్ నేతలు పేర్కొంటున్నారు.

అయితే ముకుల్ రాయ్ నియామకంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. బీజేపీ టిక్కెట్‌పై ఆయన విజయం సాధించారని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత సుబేందు నేతృత్వంలో ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ముకుల్ రాయ్‌ను పీఏసీ చైర్మన్‌గా నియమించి, అధికార తృణమూల్ నియమ నిబంధనలను తుంగలో తొక్కిందని సుబేందు తీవ్రంగా దుయ్యబట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు