మహిళా జర్నలిస్టుకు ఎఫ్-పదం ఈ-మెయిల్: ముంబై ఎయిర్‌పోర్టులో వ్యక్తి అరెస్ట్

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (15:52 IST)
ఓ మహిళా ఉద్యోగినిని వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్న నిందితుడు.. భారత్‌కు వస్తున్న విషయం తెలుసుకుని ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు (30)కి గత ఏడాది నవంబర్‌లో 52ఏళ్ల వ్యక్తి అసభ్య పదజాలంతో ఈమెయిల్ పంపించాడు. ఏవో కొన్ని కారణాలతో అతను పంపించిన ఈ-మెయిల్‌ను చూసి సదరు ఉద్యోగిని షాక్ తింది. 
 
ఎఫ్ అనే పదంతో తనను దూషించినట్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. అమెరికాలో ఉన్న అతనికి పోలీసులు సమన్లు పంపించారు. సమన్లకు నిందితుడు స్పందించకపోవడంతో.. అతను భారత్‌కు ఎప్పుడొస్తాడా అని వేచి చూశారు. తీరా సోమవారం అతడు ముంబై విమానాశ్రయంలో అడుగుపెట్టగానే లుకౌట్ నోటీసులతో కాచుకుని ఉన్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఇంకా ఐపీసీ సెక్షన్ 26తో పాటు పనిచోట లైంగిక వేధింపులకు గురిచేసిన నేరం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి