ప్రసూతి వార్డులోకి అనుమతించలేదనీ... వైద్యుడి చెవి కొరికేశాడు...

సోమవారం, 11 మే 2020 (09:01 IST)
తన భార్య ఉన్న ప్రసూతి వార్డులోకి అనుమతించలేదన్న కోపంతో ఓ వ్యక్తి వైద్యుడి చెవి కొరికేశాడు. ఈ దారుణ ఘటన ఒడిషా రాష్ట్రంలోని బరంపురంలో ఆస్పత్రిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బరంపురంలో మహారాజా కృష్ణచంద్ర గజపతి వైద్య కళాశాల ఆసుపత్రి ఉంది. గంజాం జిల్లాకు చెందిన పురుషోత్తంపూర్‌కు చెందిన తరిణి ప్రసాద్ మహాపాత్రో కాన్పు కోసం తన భార్యను ఆసుపత్రిలో చేర్చాడు. ఆ మహిళ వెంట అప్పటికే ఐదుగురు సహాయకులు ఉన్నారు. 
 
ఈ పరిస్థితుల్లో తరణి కూడా ప్రసూతి వార్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. పైగా, అది ప్రసూతి వార్డు కావడంతో పురుషులను అనుమతించేది లేదని వైద్య సిబ్బంది తేల్చి చెప్పారు. 
 
అయితే, తన భార్య వద్దకు అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. కానీ వైద్య సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆగ్రహంతో చిందులేసిన తరిణి ప్రసాద్ తనను అడ్డుకున్న వైద్యుడు స్మృతి రంజన్‌పై దాడిచేశాడు. అప్రమత్తమైన మిగతా వైద్యులు అతడిని అడ్డుకున్నారు. 
 
దీంతో మరింత రెచ్చిపోయిన తరిణి, పీజీ వైద్య విద్యార్థి షకీల్ ఖాన్ ఎడమ చెవిని బలంగా కొరికేశాడు. మిగతా వైద్యులపైనా దాడిచేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తరిణి ప్రసాద్‌ను అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు