బుజ్జీ నాకు కరోనా వచ్చింది జాగ్రత్త అని భార్యకు చెప్పి ఫోన్ స్విచాఫ్, ఆ తర్వాత ప్రియురాలితో ఎంజాయ్..

శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:38 IST)
ఓ భర్త.. కరోనాను అడ్డుపెట్టుకుని భార్యకు మస్కా కొట్టాడు. తనకు కరోనా సోకిందని, ఇకపై బతికే ఛాన్సులు లేవని నమ్మించాడు. ఆ తర్వాత తన మొబైల్‌ను స్విఛాఫ్ చేసి, ప్రియురాలితో రాసలీలల్లో మునిగిపోయాడు. పోలీసులకే పెద్ద మిస్టరీగా మారిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
అతని పేరు మనీష్ మిశ్రా. ముంబైలోని ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య కూడా ఉంది. పైపెచ్చు... ఓ మహిళతో వివాహేతర సంబంధం కూడావుంది. అయితే, భార్యను శాశ్వతంగా వదిలివేసి ప్రియురాలితోనే ఉండిపోవాలని ప్లాన్ వేశాడు. అంతే.. కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకున్నాడు.
 
తనకు కరోనా వైరస్ సోకింది. ఇక నేను బతకను అంటూ భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె తేరుకునే లోపలే అతడు ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో గాబరా పడిపోయిన ఆమె.. తన పతి దేవుడు ఏ అఘాయిత్యం చేసుకున్నాడో అనుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూన్ 24న భర్త కనబట్లేదని భార్య ఫిర్యాదు చేయగా ఇటీవలే పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. 
 
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు... అసలు నిజం తెలిసి అవాక్కయ్యారు. అతడు స్విచ్ఛాఫ్ చేయక మునుపు ఫోన్ చివరి లొకేషన్‌ను గుర్తించారు. అక్కడికెళ్ళి చూస్తే.. అతడి బైక్, ఇతర వస్తువులు కనిపించాయి. ఆ పక్కనే ఉన్న సరస్సులో మునిగిపోయాడేమో అనే అనుమానంతో వారు జాలర్ల సాయంతో ముమ్మర తనిఖీలు చేశారు. అతడి ఆచూకీ లభించకపోవడంతో అతడు చనిపోలేదని పోలీసులకు నమ్మకం కుదిరింది. 
 
దీంతో స్థానికంగా రికార్డైన సీసీటీవీ ఫుటేజీలను వారు జల్లెడ పట్టారు. వివిధ రాష్ట్రాల పోలీసులకు అతడి ఫొటో, ఇతర వివరాలను పంపించారు. ఈ క్రమంలో ఒకానొక సీసీటీవీ ఫుటేజీలో అతడి ఆచూకీ దొరికింది. ఓ మహిళతో పాటూ కారులో మనోడు షికారు కొడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 
 
ఇంకేముంది.. పెద్ద మిస్టరీగా కనిపించిన కేసు ఆ తర్వాత క్షణాల్లో పరిష్కారమైపోయింది. సదరు భర్త తన ప్రేయసితో ఇండోర్‌లో కులాసాగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అతడిని ముంబైకి తీసుకొచ్చి భార్య వద్ద వదిలిపెట్టారు. భార్యను మోసం చేసినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు