ఆ దేవుడు కూడా రేప్‌లను ఆపలేడు : యూపీ గవర్నర్!

మంగళవారం, 22 జులై 2014 (10:58 IST)
దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా అదనపు గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న అజీజ్ ఖురేషీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో జరుగుతున్న రేప్‌లను ఆ దేవుడు కూడా ఆపలేడంటూ వ్యాఖ్యానించారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అరాచకత్వంపై ఇప్పటివరకు సమాజ్ వాదీ పార్టీ నేతల బాధ్యతారాహిత్య ప్రకటనలు చేస్తూ వచ్చారు. వీటిపై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగిన విషయం తెల్సిందే. ఇప్పుడు యూపీ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన అజీజ్ ఖురేషి కూడా వారి సరసన చేరారు. రాజ్‌భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఖురేషి తీవ్ర వ్యాఖ్య చేశారు. 
 
రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతుండడం పట్ల మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... ఆ దేవుడు దిగివచ్చినా అత్యాచారాలను నిరోధించలేడని సెలవిచ్చారు. అంతేగాకుండా ప్రపంచంలో ఉన్న పోలీసులను అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినా రేపుల పర్వం ఆగదని తన అమూల్య అభిప్రాయం వెలిబుచ్చారు. అయినా, యూపీ సర్కారు శాంతిభద్రతల కోసం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఖురేషి పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి