మెక్‌డొనాల్డ్స్‌కు రూ.6 కోట్ల అపరాధం.. ఎందుకో తెలుసా?

శుక్రవారం, 21 జులై 2023 (13:54 IST)
చికెన్‌ నగెట్స్‌ తిందామని ఆశపడిన చిన్నారికి.. విపరీతమైన వేడిగా ఉన్న ఆహారం అందించినందుకు ప్రముఖ ఫుడ్‌ చెయిన్‌ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌ కంపెనీకి భారీ అపరాదాన్ని వడ్డించారు. ఇది అమెరికాలో చోటు చేసుకుంది. ఒలివియా కారబల్లో అనే నాలుగేళ్ల చిన్నారి 2019లో ఫ్లొరిడాలోని ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ సమీపంలో మెక్‌డొనాల్డ్స్‌ డ్రైవ్‌ ఇన్‌కు వెళ్లి, అక్కడ హ్యాపీ మీల్‌ను కొనుగోలు చేసింది. దానిని తినేందుకు కారులో బాక్స్‌ తెరవగా విపరీతమైన వేడిగా ఉన్న ఓ నగెట్‌ ఆమె కాలుపై పడింది. 
 
ఈ ఘటనలో ఆమె కాలుకు స్వల్ప గాయమైంది. దీనికితోడు ఆమె భయంతో చాలా సేపు ఏడుస్తూనే ఉంది. దీంతో ఒలివియా కుటుంబ సభ్యులు మెక్‌డొనాల్డ్స్‌పై ఫ్లొరిడాలోని న్యాయస్థానంలో కేసు ఫైల్‌ చేశారు.
 
కోర్టుకు చిన్నారి గాయం ఫొటోలు, ఆ సమయంలో పాప బాధతో ఏడుస్తున్న ఆడియోను అందించారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ చిన్నారికి గతంలో పడిన ఇబ్బందికి నాలుగు లక్షల డాలర్లు.. భవిష్యత్తు కోసం మరో నాలుగు లక్షల డాలర్లు చెల్లించాలని మెక్‌డొనాల్డ్స్‌ను ఆదేశించింది. 
 
ఇది భారత కరెన్సీలో రూ.6.5 కోట్లకు సమానం.
ఈ కేసులో మెక్‌డొనాల్డ్స్‌ తరపు లాయర్‌ స్పందిస్తూ.. కాలిన గాయం మూడు వారాల్లో తగ్గిన తర్వాత నొప్పి కూడా పోయిందని బాధితురాలి కుటుంబీకులు చెప్పారని వాదించారు. ఆమెకు 1.56 లక్షల డాలర్లు సరిపోతాయన్నారు. 
 
ఆ పాప ఇప్పటికీ మెక్‌డొనాల్డ్స్‌ ఔట్‌లెట్లకు వెళ్లి చికెన్‌ నగెట్లను తింటోందని చెప్పారు. కానీ, న్యాయస్థానం మాత్రం 8,00,000 డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు