రేపు మోదీ కేబినెట్ కీలక భేటీ!

మంగళవారం, 19 మే 2020 (21:23 IST)
కేంద్ర కేబినెట్ బుధవారం ఉదయం పదకొండు గంటలకు భేటీ కాబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ పరిస్థితులను, కరోనా వ్యాప్తిలో పెరుగుతున్న వేగం వంటి అంశాలను చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా గత వారం ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఆర్థిక ప్యాకేజీపై వస్తున్న ఫీడ్ బ్యాక్‌పై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. రెండు నెలలుగా దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. వైరస్ నియంత్రణ సాధ్యం కాకపోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష అంకెను దాటేసింది. మరో రెండు, మూడు నెలల దాకా కరోనా ఉధృతి కొనసాగనున్నట్లు అంఛనాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దేశం ఆర్థికంగా కుంగిపోయింది. దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ఉద్దీపనలను ప్రకటించింది. రంగాల వారీగా ప్యాకేజీలను వెల్లడించింది. అయితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన ప్యాకేజీలతో లాభం లేదన్న అభిప్రాయాన్ని విపక్షాలతోపాటు కొన్ని న్యూట్రల్ రాజకీయ పార్టీలు సైతం తప్పుపడుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రకటించిన ప్యాకేజీని పచ్చిమోసంగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్థిక ప్యాకేజీపై పెదవి విరవగా.. పలు విదేశీ మీడియా సంస్థలు తమ విశ్లేషణల్లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని డొల్లప్యాకేజీగా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీపై వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై కేబినెట్ సమావేశం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇక కరోనా వైరస్ నియంత్రణా చర్యలను, వలస కార్మికుల తరలింపు కారణంగా ఉత్పన్నమైన పరిణామాలను కేబినెట్ చర్చించే ఛాన్స్ వుంది. రోడ్డు రవాణాకు దాదాపుగా ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్… రైలు, విమానయానంపై మాత్రం మే 31వ తేదీ దాకా నిషేధం కొనసాగిస్తోంది.

అయితే, డొమెస్టిక్ విమానాలను నడపాలన్న డిమాండ్ బలపడుతున్న తరుణంలో రేపటి కేంద్ర కేబినెట్ భేటీలో ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రైళ్ళ విషయంలోను కొనసాగుతున్న కొన్ని పరిమితులను మరింత సరళీకరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపే పరిస్థితి కనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు