మరింత ప్రమాదకరంగా కరోనా సెకండ్‌ వేవ్‌: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:16 IST)
కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత ప్రమాదకరంగా మారిందని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా పేర్కొన్నారు. అధిక సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయని, ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కరోనా కట్టడికి కంటైనర్‌ జోన్‌లను ప్రకటించడం, ప్రజలు గుమిగూడటంపై నిషేధం విధించడం, భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను చేపట్టడం వంటి మూడు దశలను అమలు చేయాలని అన్నారు. ప్రముఖ మీడియా ఛానెల్‌ ఆదివారం నిర్వహించిన ఆన్‌లైన్‌ సదస్సు 'సొల్యూషన్స్‌'లో గులేరియా పాల్గన్నారు.

ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు కరోనా వేరియంట్స్‌ ఉన్నప్పటికీ.. భారత్‌లో అన్ని వేరియంట్స్‌ ఇంకా కనిపించలేదని.. అది కొంత వరకు సంతోషించాల్సిన విషయమని అన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని, కంటైన్‌మెంట్‌ జోన్‌లను ప్రకటించాలని, అలాగే కరోనా పరీక్షలు, బాధితులను గర్తించడం, వైద్యం అందించడం వంటివి మరింత ఎక్కువగా చేపట్టాలని అన్నారు.

రెండవది.. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మూడవది.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. గతంలో దేశవ్యాప్తంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌లను ఏ విధంగా విభజించామో తిరిగి అదే విధంగా జోన్‌లను విభజించాలని అన్నారు.

అలాగే ఆక్సిజన్‌, బెడ్స్‌ కొరత లేకుండా చూడాలని అన్నారు. వందేళ్ల క్రితం క్రితం వచ్చిన మహమ్మారుల కంటే సెకండ్‌ వేవ్‌ మరింత ప్రమాదకరంగా ఉందని, అయినా ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదని అన్నారు. ఎబోలా వైరస్‌కు చికిత్సనందించేందుకు రెమిడెసివిర్‌ను అభివృద్ధి చేశామని, ఇది ఒక యాంటీవైరల్‌ డ్రగ్‌ అని.. కరోనాపై ప్రభావం చూపుతుందని అయితే.. మరణాల సంఖ్య తగ్గుతుందని మాత్రం కచ్చితంగా చెప్పలేమని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు