గగనంలో ఆగిపోయిన ఇంజన్.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

శనివారం, 21 మే 2022 (09:29 IST)
ఎయిర్ ఇండియా విమానానికి పెను ముప్పు తప్పింది. ముంబై నుంచి బెంగుళూరుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. గగనతలంలో ఉండగానే ఒక్కసారిగా ఆ విమానం ఇంజిన్ ఒకటి మొరాయించింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. దీంతో విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, గురువారం ఉదయం 9.43 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో విమానం బెంగుళూరుకు బయలుదేరింది. 
 
రెండు సీఎఫ్ఎం ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో ఒకటి గగనతలంలో ఉండగానే మొరాయించింది. ఇంజిన్ పని చేయడం ఆగిపోవడాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. 
 
వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి, సమాచారాన్ని విమానాశ్రయ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ తర్వాత ప్రయాణికులను మరో విమానంలో బెంగుళూరుకు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు