క్యూ లైన్‌ బ్రేక్ చేసిందని మహిళను చావబాదిన ముంబై పోలీసులు.. ముంబైలో ఖాకీల రాక్షసత్వం

సోమవారం, 28 సెప్టెంబరు 2015 (16:52 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబై నగర పోలీసులు మరోమారు తమ దురుసుతనాన్ని ప్రదర్శించారు. వినాయక దర్శనం కోసం వచ్చిన ఓ యువతి క్యూ లైన్‌ను బ్రేక్ చేసిందన్న అక్కసుతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు చావబాదారు. ఆ తర్వాత బయటకు ఈడ్చిపారేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే గణపతి విసర్జన్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతి సాధారణ క్యూ లైన్‌లో కాకుండా, వీఐపీ గేటులో వచ్చింది. దీన్ని గమనించిన ఓ మహిళా కానిస్టేబుల్ తొలుత ఆ మహిళను అడ్డుకుంది. దీంతో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇంతలో ఇంకో వైపు నుంచి వచ్చి మరో మహిళా కానిస్టేబుల్ ఆ మహిళ చెంప చెళ్ళుమనిపించింది. 
 
ఆ తర్వాత ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కలిసి ఆ మహిళను చావబాదారు. ఈ తంతంగాన్నంతా కొందరు వ్యక్తులు వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ విస్తరించి కలకలం రేపింది. దీంతో ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. గణేశ్ నిమజ్జనం సమయంలో సున్నితంగా వ్యవహరించాల్సిన పోలీసులు రౌడీల్లా వ్యవహరించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమౌతున్నాయి.

వెబ్దునియా పై చదవండి