ఇంతకంటే మెరుగైన 'రుచికరమైన' సాక్ష్యం లేదు!' : ఆనంద్ మహీంద్రా

వరుణ్

సోమవారం, 29 ఏప్రియల్ 2024 (15:04 IST)
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ముంబైలో ఫుడ్ డెలివరీ చేసే డబ్బావాలా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని లండన్‌లో ఇటీవల ప్రారంభించిన ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌ గురించి మహీంద్రా వీడియోను పోస్టు చేశారు. సోమవారం ఉదయం హడావిడిగా ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే వారికి భోజన సమయంలో వారి ఇంటి నుంచి లంచ్‌ బాక్స్‌లను తీసుకొని కార్యాలయాల్లో, స్కూళ్లలో అందించడం ముంబైలో డబ్బావాలాలు చేసే పని.
 
లండన్‌లోని కొందరు వ్యాపారులు డబ్బావాలాను ఆదర్శంగా తీసుకొని ఓ డెలివరీ స్టార్టప్‌ను ప్రారంభించారు. వారు ఫుడ్ ప్యాకేజింగ్ కోసం స్టీలు డబ్బాలను ఉపయోగిస్తూ పన్నీర్ సబ్జీ, మిక్స్‌డ్ వెజిటబుల్‌ రైస్ వంటి భారతీయ వంటలను స్వయంగా వండి ఆర్డర్‌లను ప్యాక్ చేస్తున్నారు. అనంతరం వాటిని బట్టతో చుట్టి కార్గో బైక్‌లలో డెలివరీ చేస్తున్నారు. ఈ వీడియోను షేర్‌ చేస్తూ మహీంద్రా 'రివర్స్‌ కాలనైజేషన్ అవుతుందని చెప్పడానికి ఇంతకంటే మెరుగైన, 'రుచికరమైన' సాక్ష్యం లేదు!' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.
 
భారత్‌లో మొదలైన ఓ స్టార్టప్‌ లండన్‌లో గుర్తింపు పొంది, అక్కడి ప్రజలు ఆదరిస్తుండటంతో నెటిజన్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ 'ఇది వలసవాదమా లేక వ్యాపార అవకాశమా' అని రాసుకొచ్చారు. 'ప్లాస్టిక్‌ భూతం నుంచి భూమిని రక్షించుకోవడానికి వెనక్కివెళ్లడం ఒక్కటే పరిష్కారం' అని మరో నెటిజన్ స్పందించారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ 'వివిధ నగరాలు, దేశాల్లో ఇటువంటి స్టార్టప్‌లను అమలుచేయడానికి డబ్బావాలా ఓ కేస్‌ స్టడీలా ఉపయోగపడుతోంది' అని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు