'ఎప్పుడూ దగ్గుతూ ఉండే కేజ్రీవాల్కు రోగం నయమయ్యేదెప్పుడో, ఢిల్లీ ప్రజలకు పాలన దొరికేదెప్పుడో' అంటూ సెటైర్లు విసిరిన బీజేపీ మాజీ నేత, మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అదును చూసి దెబ్బకొట్టాడు.
వచ్చే యేడాది పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నవ్జ్యోత్ సింగ్ సిద్ధూను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆవిధంగా మాట ఇచ్చినందుకే సిద్ధూ రాజ్యసభ సభ్యత్వానికి, బీజేపీకి గుడ్బై చెప్పారని, తీరా ఇప్పుడు కేజ్రీవాల్ వైఖరితో రెంటికీ చెడ్డ రేవడి అయ్యారన్నది సమాచారం.
నిజానికి 2014 లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలోనూ అలాగే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీజేపీ తరపున ప్రచారం చేసిన సిద్ధూ... కేజ్రీవాల్ను తూర్పారబట్టారు. అసలే హాస్యచతురత ఎక్కువ ఉండటంతో కేజ్రీవాల్ను తన మాటల గారడితో ఫుట్బాల్ ఆడేసుకున్నాడు. అనేక కుళ్లు జోకులు, సెటైర్లూ కూడా వేశారు. కేజ్రీవాల్ను అంత తీవ్ర స్థాయిలో విమర్శించి మళ్లీ ఆప్లో చేరాలనుకున్న సిద్ధూ ఎంట్రీపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం.
దీనికి తోడు సిద్ధూ, తనతో పాటు తన భార్యకు కూడా టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారంటూ మీడియాకు లీకులివ్వడం మొదలుపెట్టారు. ఈ లీకులు అరవింద్ కేజ్రీవాలే చేయించారన్నది సమాచారం. ఇలా సరిగ్గా టైం చూసి సిద్ధూను దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.