నర్సులే డెలివరీ చేశారు.. కవలలు పుట్టారు.. అంబులెన్స్ అందకపోవడంతో..

ఆదివారం, 13 ఆగస్టు 2017 (13:55 IST)
మాతాశిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ.. వాటి అమలులో అరకొరగానే మిగులుతోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు సరైన వైద్యం అందలేదు. సమయానికి జనని ఎక్స్‌‌ప్రెస్ (అంబులెన్స్) అందుబాటులోకి రాకపోవడంతో వైద్య సాయం దక్కలేదు. ఇంతలో అనుకోని ఘోరం జరిగిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే బాలాఘాట్ పరిధిలోని ఖమరియా గ్రామ నివాసి సుష్మ తొమ్మిదో నెల గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు వస్తున్న నేపథ్యంలో భర్త అనంతరామ్ జనని ఎక్స్‌ప్రెస్‌కు ఫోన్ చేశాడు. అయితే అది అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యులు లేకపోవడంతో నర్సులే ఆమెకు డెలివరీ చేశారు. ఈ సమయంలో ఒక బిడ్డ జన్మించింది. 
 
అయితే అరగంటలోనే ఆ శిశువు మరణించింది. ఇంతలో తల్లి పరిస్థితి విషమించింది. పైగా ఆమె గర్భంలో మరో శిశువు ఉన్న గ్రహించిన నర్సు.. వెంటనే ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించింది. దీంతో మళ్లీ జనని ఎక్స్‌ప్రెస్‌ను సంప్రదించినా ఫలితం లేకపోయింది. ప్రైవేట్ వాహనంలోనే బాధితురాలిని బైహర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు అందుబాటులో లేరు. 
 
బాధితురాలి రెండో బిడ్డకు పురుడు పోసింది. మగపిల్లవాడు పుట్టాడు. అయితే తల్లి ఆరోగ్యం ప్రమాదకరంగా ఉండటంతో ఆ నర్సు బాధితురాలిని.. జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించింది. దీంతో మరేంచేసేదిలేక ఆమెను ప్రైవేటు వాహనంలో తరలించేందుకు భర్త సిద్ధమయ్యాడు. ఆమెను వాహనంలోకి ఎక్కించి ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆమె మృత్యువాత పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి