యూట్యూబ్ ద్వారా రూ.4 లక్షలు అర్జిస్తున్న కేంద్ర మంత్రి!!

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:12 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. జాతీయ రహదారుల శాఖామంత్రిగా ఉన్నారు. ఈయన యూట్యూబ్ ద్వారా నెలకు రూ.4 లక్షల మేరకు సంపాదిస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. 
 
తాజాగా, హ‌ర్యానాలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గ‌డ్క‌రీ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో తాను ఇంటికే పరిమితమై రెండు పనులు చేశాన‌ని అన్నారు. ఒకటి ఇంట్లో వంట చేయడం కాగా, ఇంకోటి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపన్యాసాలు ఇవ్వడం అని ఆయ‌న చెప్పారు. 
 
తాను ఆన్‌లైన్‌లో చాలా క్లాసులు తీసుకున్నానని, వాటిని యూ ట్యూబ్‌లోనూ అప్‌లోడ్‌ చేశాని వివ‌రించారు. దీంతో వాటికి వ్యూస్ బాగా వ‌చ్చాయ‌ని, యూట్యూబ్ త‌న‌కు నెలకు నాలుగు లక్షలు చెల్లిస్తోందని తెలిపారు.
 
తాను త‌న బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోనని స్పష్టం చేశారు. త‌న‌ పెళ్లైన కొత్తలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. త‌న‌కు పిల్ల‌నిచ్చిన మామ రోడ్డు మధ్యలో ఇంటిని క‌ట్టుకున్నార‌ని, ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లి అక్కడ నుంచి తన వద్దకు వచ్చిందన్నారు. 
 
నిబంధనలకు విరుద్ధంగా ఎవరు నిర్మించినా కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. అయితే, ఈ చ‌ర్య‌లు తన భార్య కాంచనకు తెలియకుండా తీసుకున్నాన‌ని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు