చెన్నై జనాలకు ఇప్పటివరకూ కరెంట్ లేదు కానీ చెన్నై చెపాక్ స్టేడియంలో మాత్రం బొగ్గులు...

బుధవారం, 14 డిశెంబరు 2016 (16:44 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తలెత్తిన ప్రకృతి ఉత్పాతం వార్థా తుఫాన్. ఈ తుఫాన్ దెబ్బకు చెన్నై నగరం కకావికలమైంది. ఉత్తర చెన్నైలోని చాలా ప్రాంతాల్లో ఇంతవరకూ కరెంటు లేదు. చన్నై పురశైవాక్కం నుంచి మనాలి వరకూ అంతా కారుచీకట్లే. రోడ్లపై పడిపోయిన చెట్ల కొమ్మలు, రోడ్ల పక్కనే చిందరవందరగా దర్శనమిస్తున్నాయి. 
 
యుద్ధ ప్రాతిపదికన చెన్నైలో కరెంటు సరఫరా చేస్తామని ప్రకటించిన విద్యుత్ శాఖామంత్రి మాటలకు తగ్గట్లుగా చేతలు లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. నీటి కటకటతో ప్రజలు అల్లాడుతున్నారు. నీటి క్యానులు తీసుకుని రోడ్లపై ఎక్కడ పంపులు కనబడితే అక్కడ క్యూల్లో నిలబడి నీళ్లు పట్టుకుంటున్నారు. ఈ తంతు అర్థరాత్రి దాటినా సాగుతూనే ఉంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా విద్యుత్ పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలు కనబడటం లేదు. పడిపోయిన విద్యుత్ స్తంభాలు, తీగలను సరిచేసే సిబ్బంది జాడ లేదు. 
 
ఈ ప్రకారం చూస్తుంటే ఉత్తర చెన్నైలో విద్యుత్ మరో 10 రోజులు దాటినా రాదని జనం అనుకుంటున్నారు. ఇప్పటికే పన్నీర్ సెల్వం నత్తనడక పనులపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు డీఎంకె పరిస్థితిని పరిశీలిస్తోంది. అధికార పక్షం ప్రజల కష్టాలను తీర్చడంలో విఫలమవుతుండటాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదిలావుంటే వార్థా తుఫాన్ సృష్టించిన బీభత్సం దృష్ట్యా ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య ఐదో టెస్ట్ ఇక్క‌డి చెపాక్ స్టేడియంలో జ‌రుగుతుందా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. 
 
కానీ త‌మిళ‌నాడు క్రికెట్ అసోసియేష‌న్ మాత్రం మ్యాచ్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తామ‌నీ, చెపాక్ స్టేడియం బురద బురదగా మారడంతో దాన్ని ఆరబెట్టేందుకు మండించిన బొగ్గుల‌ను ఉంచుతున్నారు. మొత్తమ్మీద జనం కష్టాలు దేవుడికెరుక కానీ క్రికెట్ మాత్రం నిర్వహించి తీరుతారట. ఏం చేస్తాం... ఎవడి గోల వాడిది... అంతే కదా...!!

వెబ్దునియా పై చదవండి