తాజ్‌మహాల్ గదుల్లో హిందూ దేవతా విగ్రహాలు లేవు!

సోమవారం, 4 జులై 2022 (13:21 IST)
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా వినుతికెక్కిన తాజ్‌మహాల్‌ ప్రేమ మందిరంలోని గదుల్లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నట్టు గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. దీనిపై భారత పురావస్తు శాఖ సమాచార హక్కు చట్టం కింద ఓ  పౌరుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. తాజ్ మహాల్‌లో మూసివున్న నేలమాళిగల్లో ఒక్క దేవతా విగ్రహంగానీ, మూసివున్న గదులుగానీ లేవని స్పష్టం చేస్తూ సమాధానిచ్చింది. ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చింది. 
 
తాజ్‌మహల్‌ నేలమాళిగలో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని ఇటీవల ప్రచారం జరిగింది. అందులో మూసి ఉన్న 22 గదులను తెరవాలని.. అయోధ్య భాజపా మీడియా ఇన్‌ఛార్జి డా.రజనీశ్‌ కుమార్‌ 2022, మే 7న అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. ఆ గదులు తెరిచేలా ఏఎస్‌ఐకి ఆదేశాలు ఇవ్వాలని ఆ వ్యాజ్యంలో కోరారు. 
 
అయితే.. మే 12న ధర్మాసనం దీనిని తోసిపుచ్చింది. ఇది జరిగిన కొన్ని రోజులకు తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి సాకేత్‌ గోఖలే.. జూన్‌ 21న ఆర్‌టీఐ కింద ఏఎస్‌ఐని కొన్ని ప్రశ్నలు అడిగారు. 'తాజ్‌ మహల్‌ ఉన్న భూమి.. ఏదైనా ఆలయానికి చెందినదా? తాజ్‌ మహల్‌ నేలమాళిగలోని మూసి ఉన్న గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయా?' అని ప్రశ్నించారు. దీనికి బదులుగా.. మూసివున్న గదుల్లేవని, ఆ ప్రదేశమూ ఏ ఆలయానికి చెందినది కాదని భారత పురావస్తు శాఖ స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు