ఆ సర్టిఫికేట్ లేకుంటే వాహనం స్వాధీనం.. కేంద్రం కొత్త చట్టం

సోమవారం, 30 నవంబరు 2020 (12:34 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కొత్త చట్టం తెచ్చింది. ఇది వచ్చేయేడాది జనవరి నుంచి అమల్లోకి రానుంది. తమ వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ తీసుకోని వారిపై మరింత కఠినంగా వ్యవహరించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. 
 
పీయూసీ సర్టిఫికెట్ లేకుంటే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)ను స్వాధీనం చేసుకునేలా జనవరి నుంచి కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఈ మేరకు ముసాయిదాను తయారు చేసిన కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ వివిధ వర్గాల అభిప్రాయాలను కోరింది.
 
కాగా, ఈ నూతన వ్యవస్థలో భాగంగా అన్ని వాహనాల యజమానుల వివరాలను మోటార్ వాహనాల డేటాబేస్‌కు అనుసంధానించిన సర్వర్లలో పొందుపరుస్తారు. ఏదైనా వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు పీయూసీ లేకుంటే, వారం రోజుల గడువు ఇస్తారు. 
 
వారంలోగా పొల్యూషన్ సర్టిఫికెట్‌ను తీసుకోకుంటే, ఆర్సీని అధికారులు స్వాధీనం చేసుకుంటారు. వాహనాల ద్వారా విడుదలవుతున్న కాలుష్యం ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనను పకడ్బందీగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
 
ఇదేసమయంలో అన్ని రకాల వాహనాల పీయూసీ సర్టిఫికెట్ల జారీని కూడా మారుస్తూ, ఒకే రకమైన సర్టిఫికెట్‌ను ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయించింది. కొత్త సర్టిఫికెట్‌లో క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే, వాహన యజమాని, వాహనం వివరాలు, అది విడుదల చేస్తున్న కాలుష్య ఉద్గరాల పరిమాణం వంటి వివవరాలన్నీ ఉంటాయి.
 
అంతేకాకుండా, పీయూసీ తీసుకోవడానికి ముందే యజమాని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ కూడా వచ్చేలా నూతన వ్యవస్థ పనిచేయనుంది. ఈ విధానంలో వాహనాల దొంగతనాలను కూడా నివారించవచ్చని కేంద్రం భావిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు