పెద్ద నోట్ల కష్టాలు.. బ్యాంకులకు 3 రోజులు సెలవు.. జమ్మూలో పరిస్థితి భిన్నం..?

శనివారం, 10 డిశెంబరు 2016 (08:47 IST)
అసలే పెద్ద నోట్లతో ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే.. బ్యాంకులకు మూడు రోజుల పాటు సెలవులతో మూతపడనున్నాయి. మూడు రోజులపాటు బ్యాంకులకు వరుసగా సెలవులు వచ్చాయి. శనివారం రెండో శనివారం కాగా మధ్యలో ఆదివారం రాగా సోమవారం మిలాద్‌ఉన్‌నబీ పర్వదినం కారణంగా సెలవు ప్రకటించారు. దీంతో బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందిపడాల్సి వస్తోంది. అసలే పెద్దనోట్ల రద్దుతో ఇక్కట్లకు గురవుతున్న ప్రజానీకానికి మళ్లీ మూడు రోజులపాటు వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో కష్టాలు అధికమయ్యే అవకాశముంది.
 
అయితే కాశ్మీర్‌లో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అని సోపోర్‌లోని జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్‌ ఇజాజ్‌ అహ్మద్‌ వెల్లడించారు. కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మూలంగా ప్రజల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడమే దీనికి కారణమని తెలిపారు. 
 
జులైలో హిజ్బుల్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ అనంతరం అక్కడ ఎక్కువగా కర్ఫ్యూ నీడలోనే గడిచింది. ఈ సమయంలో జనం ఎక్కువగా ఇళ్లకే పరిమితమైపోయారు. వారు బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం మాట అటుంచితే.. సేవ్‌ చేసుకున్న అంతో ఇంతో డబ్బు కూడా ఖర్చయిపోయింది. అందువల్లే ఏటీఎంల వద్ద దేశంలోని మిగతా ప్రాంతాల్లా కాకుండా ఇక్కడ క్యూలలో జనం తక్కువగా ఉన్నారని ఆయన చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి