ఒడిషాలో అత్యాచారాల పర్వం : ఒకే రోజు ఐదు రేప్‌లు

సోమవారం, 9 డిశెంబరు 2019 (10:56 IST)
ఒడిషా రాష్ట్రంలో కామాంధులు రెచ్చిపోయారు. ఒకే రోజు ఐదు ప్రాంతాల్లో అత్యాచారాలు జరిగాయి. దీంతో యువతులు, మహిళలు భయంతో వణికిపోతున్నారు. ఒంటరిగా బయట తిరగాలంటేనే జంకుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మయూరభంజ్ జిల్లా బాదంపహాడ్ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై నారాయణ మండల్ (25) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు తక్షణం స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. 
 
అలాగే, గంజాం జిల్లా కళ్లికోట్‌లో జరిగిన మరో ఘటనలో నాలుగేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఇంకో ఘటనలో బాలికపై యువకుడు అత్యాచారం యత్నం చేశాడు.
 
ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో 45 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కటక్‌లోని కాన్‌నగర్ ప్రాంతంలోని కాళికాదేవి ఆలయం వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఈ అత్యాచారాల ఘటనలన్నీ శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు 24 గంటల్లోనే జరిగాయి. దీంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా కామాంధుల్లో ఎటువంటి మార్పు రాలేదనడానికి ఈ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు