పరమశివుడుకు మోడీ ప్రత్యేక పూజలు... కేదర్నాథ్‌లో ధ్యానం...

శనివారం, 18 మే 2019 (16:01 IST)
దాదాపు నెలన్నర రోజుల పాటు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రచారాన్ని శుక్రవారంతో ముగించారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో మీడియాకు ముందుకు వచ్చి.. ఈ నెల 23వ తేదీన వెల్లడికానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తాము సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ధీమా వ్యక్తం చేశారు.
 
ఆ తర్వాత శనివారం ఆయన జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్‌కు వెళ్లారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ కేదర్నాథ్ క్షేత్రానికి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. ఆ తర్వాత పరమశివుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఓ బండరాయి కింద మోడీ కొద్దిసేపు ధ్యానం చేశారు.
 
కాగా, ప్రధానమంత్రి హోదాలో ఈ క్షేత్రానికి నరేంద్ర మోడీ రావడం ఇది రెండోసారి. ఆలయం సందర్శనం సందర్భంగా స్థానికుల వస్త్రధారణలో ఆయన ప్రత్యేకంగా కనిపించారు. సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో ఉండే కేదార్నాథ్‌లో ప్రధాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు  చేశారు. ఈ సందర్భంగా తనను చూసేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు.
 
ఇదిలావుండగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, కేదార్నాథ్ ఆలయ దర్శనం కోసం ఎన్నికల సంఘం అనుమతిని ప్రధాని కార్యాలయం తీసుకున్నట్టు సమాచారం. ప్రధాని పర్యటన అధికారికమైనది కావడంతో ఈసీ అనుమతి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఉత్తరాఖండ్‌లో ఆయన పర్యటించనున్నారు. ఆదివారం ఆయన బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు