జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మళ్లీ రాష్ట్ర హోదా రానుందా..?

శనివారం, 19 జూన్ 2021 (22:40 IST)
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మళ్లీ రాష్ట్ర హోదా రానుందా..? అంటే అవునని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జూన్ 24వ తేదీన ఈ సమావేశం జరుగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇతర నేతలు హాజరవుతారు.
 
చర్చల కోసం నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ చైర్‌పర్సన్ మెహబూబా ముఫ్తీ, జమ్మూ అండ్ కశ్మీర్ అప్ని పార్టీ అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జద్ లోన్ లాంటి నేతలను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభించినట్టు కేంద్రం చెబుతోంది. 
 
ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాతో పాటు కీలకమైన అంశాలను అఖిలపక్ష సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను 2019 ఆగస్టులో రద్దు చేయడంతో రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది.
 
జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదా కోల్పోయింది. తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆర్టికల్ 370ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. 
 
జమ్మూ-కాశ్మీర్‌కు ఫరూక్, మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. జూన్ 24న సమావేశం విషయమై తనకు ఫోన్ కాల్ వచ్చినట్టు మెహబూబూ ముఫ్తీ ధ్రువీకరించారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పార్టీ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
 
కేంద్రంతో చర్చలకు అవకాశంపై సీపీఎం నేత, పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ ప్రతినిధులు స్పందించారు. తనకు ఇంకా పిలుపు రాలేదన్నారు. చర్చలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా తాము స్వాగతిస్తామని, ప్రజాస్వామ పునరుద్ధరణకు యంత్రాంగం ఏర్పాటు చేయడం, జమ్మూ-కాశ్మీర్‌కు రాష్ట్రప్రతిపత్తి మీదనే చర్చలు ఉండాలని తాము గతంలోనే స్పష్టం చేశామని జేకేఏపీ అధ్యక్షుడు బుఖారి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు