ఆలయ కూల్చివేతను ఎలాగైనా అడ్డుకో బిడ్డా... పూజారి ఆత్మహత్య - సూసైడ్ నోట్

ఠాగూర్

సోమవారం, 17 మార్చి 2025 (11:17 IST)
ఏరియా అభివృద్ధి పేరుతో ఆలయాన్ని కూల్చివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ ఓ పూజారి ఆలయ ప్రాంగణంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. గుడి కూల్చివేతను ఎలాగైనా అడ్డుకో బిడ్డా అంటూ కొడుకుకు ఆత్మహత్య లేఖలో సూచించాడు. ఈ విషాదకర ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర్‍‌లో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. 
 
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుబేర్ నగర్ సంతోషి నగర్‌లో ఓ ఆలయం ఉంది. ఈ గుడిలో మహేంద్ర మినేకర్ అనే వ్యక్తి పూజారిగా వ్యవహరిస్తున్నారు. 9722లో సంతోషి నగర్‌ ఏరియాలో అభివృద్ధిలో అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో మహేంద్ర మినేకర్ తండ్రి ఈ గుడిని కట్టించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఏరియా బాగా అభివృద్ధి చెందింది. 
 
ప్రస్తుతం ఈ ఆలయ స్థలంపై కన్నేసిన కొంతమంది రియల్టర్లు దానిని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మహేంద్ర మినేకర్ కుటుంబం ఆరోపిస్తుంది. కార్పొరేషన్ అధికారులు కూడా బిల్డర్లకే వత్తాసు పలుకుతూ అభివృద్ధి పేరుతో గుడిని కూల్చివేసేందుకు పావులు కదుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన తండ్రి మహేంద్ర మినేకర్ ఉన్నతాధికారులు, బిల్డర్లపై ఒత్తిడి తెచ్చారని, కొంతకాలంగా మానసికంగా వేధిస్తున్నారని బ్రిజేశ్ మినేకర్ చెప్పారు. 
 
ఈ క్రమంలోనే ఆదివారం తన తండ్రి మహేంద్ర మినేకర్ గుడి ఆవరణలో బలవన్మరణానికి పాల్పడ్డారని బోరున విలపించాడు. సూసైడ్ నోట్‌‍లో గుడిని కాపాడాలంటూ తనకు సూచించారంటూ బ్రిజేశ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. కాగా, మహేంద్ర మినేకర్ ఆత్మహత్య విషయంపై కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు