మనకు రాజకీయాలు నేర్పుతున్న ట్విట్టర్ : రాహుల్ ఫైర్

శుక్రవారం, 13 ఆగస్టు 2021 (13:05 IST)
కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మనకు ట్విట్టర్ రాజకీయాలు నేర్పుతుందా అంటూ మండిపడ్డారు. 
 
రాహుల్ గాంధీతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన వేలాది మంది కాంగ్రెస్ నేతల ఖాతాలను ట్విట్టర్ మూసివేసింది. దీనిపై రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ సంస్థ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, తన ఖాతాను నిలిపివేసి దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని దుయ్యబట్టారు. మనకు రాజకీయాలు నేర్పాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
 
ఇటీవల ఢిల్లీలో హత్యాచారానికి గురైన ఒక దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆ చిత్రాలను ట్విట్టర్‌లో రాహుల్ షేర్ చేశారు. దీంతో రాహుల్‌ ఖాతాను ట్విటర్‌ ఇటీవల తాత్కాలికంగా స్తంభింపజేసిన విషయం తెలిసిందే. 
 
ఆ తర్వాత కాంగ్రెస్ అధికారిక ఖాతాతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలకు చెందిన దాదాపు 5 వేల ఖాతాలను ట్విటర్‌ నిలిపివేసింది. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన రాహుల్‌.. శుక్రవారం తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
 
'ట్విట్టర్‌ ఓ తటస్థ సామాజిక మాధ్యమ వేదిక కాదని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఇది ఓ పక్షపాత వేదిక. ప్రభుత్వం ఏం చెబితే అది వింటోంది. నా ట్విట్టర్‌ ఖాతాను స్తంభించి మన రాజకీయ విధానాల్లో జోక్యం చేసుకుంటోంది. మనకు రాజకీయాలను నేర్పేందుకు చూస్తోంది. 
 
ఒక రాజకీయ నాయకుడిగా దీన్ని నేను అంగీకరించలేను. ఇది కేవలం రాహుల్‌ గాంధీ మీద జరిగిన దాడి కాదు.. మన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరుగుతున్న దాడి. నా ఖాతాను నిలిపివేయడం అంటే కేవలం రాహుల్‌ గాంధీని అడ్డుకోవడం కాదు. నాకు 19-20 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారి హక్కులను కూడా అడ్డుకున్నట్లే' అని రాహుల్ దుయ్యబట్టారు. 
 
‘‘ఒక భారతీయుడిగా నేను అడిగే ప్రశ్న ఒక్కటే.. ప్రభుత్వానికి విధేయంగా ఉంటున్నాయని కంపెనీలు మనకు రాజకీయాలు నేర్పడాన్ని అంగీకరిద్దామా? లేదా మన రాజకీయాలను మనమే నిర్వచించుకుందామా? మన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోంది. పార్లమెంట్‌లో మాట్లాడనివ్వట్లేదు. మీడియాను నియంత్రిస్తున్నారు. ఇప్పుడు మా అభిప్రాయాలను ట్విటర్‌లో పెడుతుంటే అక్కడా అణగదొక్కాలని చూస్తున్నారు’’ అని కేంద్రంపైనా రాహుల్‌ విమర్శలు గుప్పించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు