సీఎం అధికారాల్లో మేం జోక్యం చేసుకోం: రాజ్‌నాథ్ సింగ్

శనివారం, 23 ఆగస్టు 2014 (11:07 IST)
ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ అధికారాలను పలుచన చేసే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.   గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఈ సందర్భంగా ఎంపీలకు రాజ్‌నాథ్ భరోసా ఇచ్చారు.
 
‘ముఖ్యమంత్రి అధికారాల్లో మేం జోక్యం చేసుకోవడం లేదు. అలాంటి ఉద్దేశం మాకు లేదు. కేవలం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేస్తున్నాం.’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. 
 
రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు కూడా మీడియాతో మాట్లాడారు. ‘హోంమంత్రితో సమావేశం ఫలవంతమైంది. గవర్నర్‌కు అధికారాలపై ఈ నెల 8న హోం శాఖ నుంచి వచ్చిన లేఖ వల్ల మాకు కొంత ఆవేదన కలిగింది. 
 
పార్లమెంటులో దాన్ని లేవనెత్తాం. రాజ్‌నాథ్‌తో భేటీలో అన్ని విషయాలు వివరించాం. రాజ్యాంగం ప్రకారం కేంద్రం ఎంత మేరకు జోక్యం చేసుకోగలదో చెప్పాం. ఏ విషయంలోనూ ముఖ్యమంత్రి అధికారాలను పలుచన చేయబోమని హోంమంత్రి మాకు హామీ ఇచ్చారు.
 
సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగానికి లోబడే వ్యవహరిస్తామని భరోసా ఇచ్చారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు.’ అని కె.కేశవరావు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి