రాజ్యసభ శుక్రవారం చరిత్రాత్మక, సంచలనానికి వేదికైంది. ట్రాన్స్జెండర్స్ హక్కుల పరిరక్షణకు తిరుచ్చి ఎంపీ శివ (డీఎంకే) ప్రవేశపెట్టిన ‘రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ బిల్లు-2014’ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్లమెంటు చరిత్రలో ఓ ‘ప్రైవేటు మెంబర్ బిల్లు’ ఆమోదం పొందడం 45ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ట్రాన్స్జెండర్స్ కోసం నిర్దిష్ట జాతీయ విధానం రూపకల్పన లక్ష్యంగా ఆయన ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి ఆమోదం లభించిన నేపథ్యంలో నేషనల్ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ కమిషన్, ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ వీరిని వివిధ దశల్లో సమాజ భాగస్వాములను చేసేలా పది చాప్టర్లు, 58 క్లాజులతో బిల్లును రూపొందించారు. ఇక ట్రాన్స్జెండర్స్ బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు పత్రాల్లో ‘థర్డ్ జెండర్’ అన్న కాలమ్ను ఏర్పాటు చేయాలని రిజర్వు బ్యాంకు అన్ని బ్యాంకులను ఆదేశించింది.