రామ మందిర నిర్మాణం.. ఆగస్టులో ప్రారంభమై.. దీపావళి నాటికి పూర్తి: స్వామి

సోమవారం, 16 అక్టోబరు 2017 (17:39 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఈసారి రామమందిర నిర్మాణంపై స్పందించారు. రామ జన్మభూమిలో పూజలు చేసుకోవడం అనేది ప్రాథమిక హక్కు అంటూ తాను వాదించినట్లు తెలిపారు. సాధారణ హక్కుల కంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత అని స్వామి వ్యాఖ్యానించారు. 
 
సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను బట్టి చూస్తే సాధారణ హక్కులపై ప్రాథమిక హక్కులదే పైచేయి సాధించిందన్నారు. రామ జన్మభూమి ప్రాపర్టీ తమదేనని ముస్లిం పార్టీలు చేసిన వాదనను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన సంగతిని సుబ్రహ్మణ్య స్వామి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే రామ జన్మభూమి విషయంలోనూ మనమే గెలువబోతున్నామన్నారు. 
 
కాగా రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై తుది విచారణ డిసెంబర్ ఐదో తేదీ నుంచి దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రామ మందిర నిర్మాణ పనులు వచ్చే ఏడాది ఆగస్టులో ప్రారంభమై, దీపావళి నాటికి ముగుస్తాయన్నారు. వచ్చే ఏడాది దీపావళికల్లా మందిరం సిద్ధమవుతుందని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు