శునకాలకు విశ్వాసం ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. యజమానుల పట్ల వాటికున్న విశ్వాసానికి సాటిలేదు. దొంగలు, ఆచూకీ తెలియని వ్యక్తుల్ని ఇంటిపక్కకు కూడా శునకాలు చేర్చవు. కానీ దొంగలకు బదులు ఓ పాము ఇంట్లోకి చొరబడాలని చూస్తే శునకాలు అడ్డుకున్న ఘటన తమిళనాడు, ధర్మపురిలో చోటుచేసుకుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే... ధర్మపురి జిల్లాలోని వెల్లలాపట్టి అనే గ్రామంలోని ఓ ఇంటికి సమీపంలో నాగుపాము వచ్చింది. గేటులో ప్రవేశించింది. అంతే కుక్కలు ఆ పామును అడ్డుకున్నాయి. పామును చూసి అరవడం ప్రారంభించిన కుక్కలతో పాము కూడా పోరాడింది. నాగుపామును ఇంట్లోకి వెళ్లనీయకుండా ముందుగా ఓ కుక్క మాత్రమే అడ్డుకుంటే.. ఆపై మరో రెండు శునకాలు సైతం దానికి తోడై పామును ఆటాడుకున్నాయి.