అద్భుతమైన ప్రాజెక్టు.. ఆహ్వానించడం ఎంతో సంతోషం : రతన్ టాటా

గురువారం, 10 డిశెంబరు 2020 (17:56 IST)
దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులతో పాటు.. దేశ పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. వీరిలో టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్ రతన్ టాటా కూడా ఉన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన వద్ద ప్రస్తావించగా, ఢిల్లీలో నిర్మించ‌నున్న నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం ఒక అద్భుత‌మైన ప్రాజెక్టు అని కొనియాడారు. ఈ ప్రాజెక్టు విజ‌య‌వంతంగా పూర్తి కావాల‌ని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ రోజన్నారు. 
 
ముఖ్యంగా, దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోనున్న ఈ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్యక్ర‌మానికి త‌న‌ను ఆహ్వానించ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని ర‌త‌న్ టాటా చెప్పారు. కాగా, నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌న నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టును కేంద్ర ప్ర‌భుత్వం టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి అప్ప‌గించింది. 
 
భవన నిర్మాణ తీరిది.. 
వచ్చే వందేళ్ల అవసరాలకు సరిపోయేలా కొత్తగా పార్లమెంట్‌ నూతన భవనాన్ని కేంద్రం ప్రభుత్వం నిర్మిస్తోంది. 64,500 చదరపు మీటర్ల పరిధిలో రూ.971 కోట్ల వ్యయం చేయనుంది. ప్రస్తుత భవనం కంటే 17వేల చదరపు కిలోమీటర్లు పెద్దగా ఉండనుంది. 
 
ఈ కొత్త భవన నిర్మాణం భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించనున్నారు. పురివిప్పి ఆడుతున్న నెమలి (జాతీయపక్షి), ఆకృతిలో లోక్‌సభ పైకప్పు, విరబూసిన కమలం (జాతీయ పుష్పం) రూపంలో రాజ్యసభ పైకప్పు, పార్లమెంట్‌లో అంతర్భాగంగా నిలువనున్న జాతీయ వృక్షం మర్రిచెట్టు రూపంలో తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ భవనాన్ని ఈ కొత్త భవనం రూపు పోలివుండనుంది. 
 
పార్లమెంట్‌ కొత్త భవనంలో గ్రౌండ్‌, మొదటి, రెండు అంతస్థులు ప్రస్తుత భవనం ఎత్తు ఉండేలా కొత్త భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఒకే సారి 1,224 మంది ఎంపీలు కూర్చుకోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు చేయనున్నారు. 
 
భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు కార్యాలయాలు నిర్మిస్తున్నారు. విశాలమైన లాంజ్‌, గ్రంథాలయం, బహుళ కమిటీలకు గదులు, భోజనశాలలు, లోక్‌సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా, సాధారణ ప్రజల కోసం ఏర్పాట్లు సైతం ఉండనున్నాయి. మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజలకు 480 సీట్లు చొప్పున ఏర్పాట్లు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు