అడుగడుగునా ఇడియట్సే..! ఈ దేశంలో ఆడదానిగా పుట్టడమే తప్పు.. ? ఐఏఎస్ ఆవేదన

సోమవారం, 3 ఆగస్టు 2015 (21:16 IST)
భారతదేశం ఓ కర్మ భూమి అంటారు. ఆడవారికి ఎక్కడా లేని గౌరవం ఇక్కడ దక్కుతుంది భావిస్తారు. కానీ ఓ ఐఎస్ఎస్ అధికారిణి పురుష అధికారుల నుంచి ఏ విధమైన వేధింపులు వస్తున్నాయో చెబుతూ ఇక్కడ ప్రతి అంగుళానికి ఇడియట్స్ కాచుకుని ఉన్నారు. కనీసం మా బాధలు పట్టించుకునే నాథుడు కూడా కరవయ్యాడు. ప్రతిక్షణం మహిళ ఇక్కడ చస్తూ బతకాలిక్కడంటూ ఐఏఎస్ ఆఫీసర్ రిజు బఫ్నా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఎవరామె? 
 
మధ్యప్రదేశ్‌లో ఆయోగమిత్ర (హ్యూమన్ రైట్స్ కమిషన్) అధికారి సంతోష్ చౌబే అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడంపై ఛత్తీస్‌గఢ్ కేడర్ ఐఏఎస్ అధికారిణి రిజు బఫ్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 1న దీని విచారణ సందర్భంగా, తాను స్టేట్మెంట్ ఇచ్చే సందర్భంలో తనకి అసౌకర్యంగా ఉండటంతో న్యాయస్థానంలో ప్రైవసీ కావాలని, అందర్నీ బయటకు పంపాలని కోరారు. 
 
ఈ పర్యాయం ఆమెపై న్యాయవాది లలిత్ శర్మ పూనకం వచ్చినట్టు ఊగిపోతూ, 'ఎంత ధైర్యం నీకు, నన్ను బయటకు వెళ్లమనడానికి? నీ ఆఫీసులో నువ్వొక ఆఫీసర్‌వి కావచ్చు. కానీ, ఇక్కడ మాత్రం కాదు. నేను ఇక్కడ లాయర్‌గా పని చేస్తున్నా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సమాధానంగా తాను ఐఏఎస్ అధికారిగా ప్రైవసీ అడగడం లేదని, ఒక మహిళగా వ్యక్తిగత స్వేచ్ఛను అడుగుతున్నానని చెప్పినట్టు ఆమె ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో కలకలం రేగింది. మహిళా అధికారికి ఎక్కడ లేని మద్దతు లభించింది.

వెబ్దునియా పై చదవండి