కఠిన శిక్షలతోనే యాసిడ్ దాడులకు అడ్డుకట్ట..!

శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (16:52 IST)
దేశంలో నానాటికి పెరిగిపోతున్న యాసిడ్ దాడుల అడ్డుకట్టకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులంతా ఏకమైయ్యారు. ఈ దాడులకు పాల్పడేవారికి మరింత కఠినమైన శిక్షలు విధించడం ద్వారా వీటిని అదుపుచేయొచ్చని నేతలు అభిప్రాయం వెలిబుచ్చారు. రాజ్యసభలో శుక్రవారం జీరో అవర్ సమయంలో జేడీయూకు చెందిన కేసీ త్యాగి ఈ విషయాన్ని లేవనెత్తారు. 
 
యాసిడ్ దాడులకు గురైన మహిళలు శారీరకంగా, మానసికంగా బాధపడుతూ జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నాన్ బెయిలబుల్ కేసులుగా సుప్రీంకోర్టు చెప్పినా నేరాలు అదుపులోకి రావడం లేదన్నారు. యాసిడ్ దాడులకు గురైన బాధితులు తమకు న్యాయం చేయండంటూ రోడ్లమీదకు వచ్చి ధర్నాలకు దిగడం అత్యంత బాధాకరమన్నారు. 
 
మహిళలే ఎక్కువగా యాసిడ్ దాడుల బారిన పడుతున్నారని, వారికి రూ.10 లక్షల నుంచి 15 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతటితో ఆగక ఆ కేసులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి