వ్యవసాయం పట్ల యువత ఆసక్తి చూపకపోవడం ప్రమాదకరం : జగ్గీవాసుదేవ్

సోమవారం, 9 సెప్టెంబరు 2019 (09:26 IST)
దేశ యువత వ్యవసాయం పట్ల ఆసక్తి చూపించకపోవడం చాలా ప్రమాదకరమని ప్రముఖ ఆధ్యాత్మిక యోగి, సద్గురు జగ్గీ వాసుదేవ్ అభిప్రాయపడ్డారు. పైగా, అత్యంత సారవంతమైన మన దేశ మట్టిని పోగొట్టుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన 'కావేరీ పిలుస్తోంది' ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ ఉద్యమానికి కర్ణాటక సీఎం యడ్యూరప్ప మద్దతు తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన చైతన్య సదస్సులో యడ్యూరప్ప, జగ్గీ వాసుదేవ్, మైసూరు సంస్థాన రాజమాత ప్రమోదాదేవి, ప్రముఖ పారిశ్రామిక వేత్త కిరణ్ మజుందార్ షా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ, కావేరీలో నీటి లభ్యత క్రమేపీ తగ్గిపోతోందని, అందువల్లే కర్ణాటక, తమిళనాడులో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. నదీ తీరంలో వృక్షాలు పెంచి రైతులకు ఆదాయం పెంచడం లక్ష్యం కావాలని, చెట్లు, పశువులు అటవీ ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. 
 
ముఖ్యంగా, వ్యవసాయానికి విపరీతంగా ఎరువులను వాడుతున్నారనీ, ఇది అనేక అనేక ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. యూరియాను మోతాదుకు మించి వాడటం వల్ల సారవంతమైన భూమిని కోల్పోతున్నామని చెప్పారు. మన దేశంలో జలాశయాలు మూడు, నాలుగు రోజుల్లోనే నిండుతున్నాయని, నీరు వేగంగా సముద్రంలోకి వెళ్లిపోయి, మన ప్రాంతాలు ఎడారిగా మారకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. 'కావేరీ' ఒక్కటే కాదు 120కి పైగా ఉపనదులు పునర్జీవం కావాలని వాసుదేవ్ పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు