ఆప్ బహిష్కృత మాజీ మంత్రి సందీప్ కుమార్ వేధింపుల్లో పలువురు మహిళలు ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా కొందరు మహిళలను లైంగికంగా వేధించినట్లు విచారణలో బయటపెట్టడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నారు. రేషన్ కార్డు కోసం వచ్చిన ఓ మహిళకు మత్తుమందిచ్చి రాసలీలలు కొనసాగించినట్టు టేప్ బహిర్గతం కావడంతో సందీప్ కుమార్ మంత్రి పదవిని పోగొట్టుకున్న విషయంతెల్సిందే.
ఈ కేసులో సందీప్పై అత్యాచారం కేసు నమోదుకావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా గతంలో చాలా మంది మహిళలను లైంగికంగా వేధించడమేగాక, వాటిని వీడియో రికార్డు చేశానని విచారణ సమయంలో సందీప్ చెప్పినట్లు పోలీసులు న్యాయస్థానానికి తెలియజేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
కాగా, పలువురు మహిళలను వేధించిన కేసుల్లో సందీప్కు సాయపడిన అతడి సన్నిహితుడు ప్రవీణ్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిజానిజాలను బయటకు తీసుకొచ్చేందుకు సందీప్కు మరో నాలుగు రోజుల పాటు కస్టడీని పొడిగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.