చిన్నమ్మ ఓటు హక్కు గోవిందా..!? పోయెస్ గార్డెన్ చిరునామానే కారణమా..!?

సోమవారం, 5 ఏప్రియల్ 2021 (18:39 IST)
జైలు నుంచి విడుదలైన దివంతగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ మరోసారి వార్తల్లో నిలిచింది. ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం పైన కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఓటర్ల జాబితాలో వీకే శశికళ పేరు కనిపించకపోవడం వివాదానికి కారణమైంది. అన్నాడీఎంకే ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల జాబితా నుంచి శశికళ పేరును తొలగించిందని టీటీవీ దినకరన్ ఆరోపించారు. 
 
శశికళ పేరు ఓటర్ల జాబితాలో కనిపించకపోవడంపై ఇప్పటికే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే.. తమిళనాడు ఎన్నికలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం శశికళకు దాదాపుగా లేనట్టేననే ప్రచారం జరుగుతోంది. వీకే శశికళ పేరును ఓటర్ల జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగానే తొలగించారని, అందుకు ప్రధాన కారణం పళనిస్వామేనని ఏఎంఎంకే ఆరోపిస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. శశికళ పేరు ఓటర్ల జాబితాలో మిస్ కావడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. శశికళ పేరు మాత్రమే కాదు, జయలలిత పోయెస్ గార్డెన్ అడ్రస్‌తో ఉన్న శశికళ బంధువు ఇళవరసి పేరు కూడా ఓటర్ల జాబితాలో కనిపించలేదు. 
 
అయితే.. పోయెస్ గార్డెన్ నివాస గృహాన్ని జయలలిత మెమోరియల్‌గా మార్చాలన్న నిర్ణయం వల్ల శశికళ, ఇళవరసి పేర్లు తొలగించబడినట్లు తెలిసింది. జయలలిత నివాస ప్రాంతమైన పోయెస్ గార్డెన్‌ను మెమోరియల్‌గా మార్చాలని అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది.  
 
చట్టం ప్రకారం.. జైలులో ఉన్న ఖైదీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. కానీ.. శశికళ ఇప్పుడు జైలు ఖైదీ కాదు. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని ఆమె విడుదలయ్యారు. ఈ తరుణంలో.. ఆమె పేరును తొలగించడం వివాదాస్పదంగా మారింది.
 
థౌంజడ్ లైట్స్ నియోజకవర్గం నుంచి ఏఎంఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్.వైద్యనాథన్ ఈ వివాదంపై స్పందించారు. శశికళ పేరును ఓటర్ల జాబితా నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఆమెకు అధికారులు ఈ విషయాన్ని చెప్పారా అని ఆయన నిలదీశారు. శశికళ జైలు నుంచి విడుదల కాగానే.. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులను ఎన్నికల సంఘం పూర్తి చేసిందని శశికళ కౌన్సిల్ సభ్యుడు రాజా సెంథుర్ పాండియన్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు