నన్ను ఆంటీ (జయలలిత)తో మాట్లాడనిచ్చేది కాదు సీనంతా శశికళదే: అమృత

శనివారం, 10 డిశెంబరు 2016 (13:26 IST)
తమిళనాడు సీఎం జయలలిత మృతి పట్ల పలు అనుమానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో, మొన్నటికి మొన్న జయమ్మ వారసురాలిని తానేనని జయలలిత అన్నకూతురు దీపజయకుమార్ సీన్లోకి వచ్చింది. తాజాగా జయమ్మ చెల్లెలి కూతురు అమృత కూడా శశికళపై ఫైర్ అయ్యింది. తమ ఆంటీతో శశికళ మాట్లాడనివ్వలేదని, శశికళ కుట్రపూరితంగా వ్యవహరించారని అమృత చెప్పింది. 
 
జయలలిత ఆసుపత్రిలో ఉండగా చూడటానికి 3 సార్లు వెళ్లానని, ఒక్కసారి కూడా శశికళ తనను లోపలికి అనుమతించలేదని అమృత ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాకుండా జయమ్మ బంధువులను ఆమె పక్కనబెట్టిందని.. అంతా కుట్ర ప్రకారం చేసుకుంటూ పోయిందని అమృత ఆరోపించింది. జయలలిత ఆస్తిని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి తమిళనాడు ప్రజలకు దక్కేలా చూడాలని, అప్పుడే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని అమృత వెల్లడించింది. జయలలిత ఆస్తి దక్కించుకోవాలని శశికళ కుట్ర పన్నిందని అమృత సంచలన ఆరోపణలు చేసింది. 
 
కాగా డిసెంబర్ 5న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. జయలలితది సహజ మరణం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. జయలలిత అక్కున చేర్చుకుని, సొంత మనిషి కంటే ఎక్కువగా నమ్మిన శశికళే జయలలిత హత్యకు కుట్రపన్నిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స జరిగిన 75రోజులు సొంత మనుషులను కూడా ఆసుపత్రిలోకి రానివ్వకుండా, శశికళే అన్నీ తానై వ్యవహరించింది. దీంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి