అన్నాడీఎంకేకు దిక్కులేని పరిస్థితి.. పార్టీ పగ్గాలు ఎవరికి..? శశికళ మౌనానికి కారణం ఏమిటి?

శనివారం, 24 డిశెంబరు 2016 (14:18 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతికి తర్వాత అన్నాడీఎంకేకు దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. జయలలిత స్థానంలో బాధ్యతలు చేపట్టాలని అమ్మ నెచ్చెలి శశికళపై ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ.. శశికళ మాత్రం ఆచితూచి అడుగేస్తోంది. ఈ నెల 29న ఏఐఎడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం ఉన్నప్పటికీ... జనరల్ సెక్రటరీగా పార్టీ అత్యున్నత పదవిని అధిష్టించేందుకు శశికళ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 
 
పార్టీ చీఫ్ ఎన్నికపై జనరల్ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ ఎంపీ, పార్టీ బహిష్కృత నేత శశికళ పుష్ప కోర్టకెక్కారు.  అంతేగాకుండా ప్రధాన కార్యదర్శి పదవికి తానుకూడా పోటీపడుతున్నాననీ, చట్టప్రకారం అందుకు వీకే శశికళకు ఆ పదవి చేపట్టే అర్హతలు లేవంటూ బాంబు పేల్చారు.
 
ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకత్వ మార్పు, జనరల్ కౌన్సిల్ సమావేశంపై చర్చకు శుక్రవారం సాయంత్రం 50 జిల్లాలకు చెందిన కార్యదర్శులు భేటీ అయ్యారు. అనంతరం పార్టీ ప్రతినిధి ధీరన్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మకు బాధ్యతలు అప్పగించాలని ఏఐఏడీఎంకే నిర్ణయించిందన్నారు. పార్టీ నాయకత్వ మార్పుపై చర్చలు జరిగినట్లు తెలిపారు. 
 
ఈ క్రమంలో శశికళకు వ్యతిరేకంగా ఒక్క గొంతుకూడా వినిపించలేదని చెప్పారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నిర్ణయమే తరువాయి అన్నారు. అయితే ఆ పదవిని చేపట్టేందుకు శశికళ తొందరపడడం అన్నాడీఎంకే అధికారిక వర్గాలు వెల్లడించాయి. శశికళ ఇంకా పార్టీ పగ్గాలు చేపట్టడంపై నోరు విప్పలేదని అన్నాడీఎంకే అధికారిక వర్గాలు తెలిపాయి. మరి శశికళ ఏం చేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి