రాజకీయ పార్టీలకు నూరుశాతం పన్ను మినహాయింపు సబబే అన్న సుప్రీంకోర్టు

గురువారం, 12 జనవరి 2017 (02:41 IST)
సాధారణ ప్రజలపై పన్ను విధిస్తుండగా రాజకీయ పార్టీలు నూటికి నూరుశాతం పన్ను మినహాయింపును ఎలా పొందుతారని వాదిస్తూ తన వద్దకు వచ్చిన పిటిషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ రాజకీయ విధానాలను ప్రచారం చేసుసునేందుకు డబ్బు అవసరం ఉంటుందని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు బెంచ్ సంబంధిత పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
ఆదాయపన్ను మరియు ప్రజాప్రాతినిథ్య చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌‌లో ఎలాంటి పసా లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
వివరాల్లోకి వెళితే.. 1961 ఆదాయ పన్ను చట్టంలోని  సెక్షన్ 13 ఎకి ఉన్న రాజ్యంగ బద్ధతను సవాలు చేస్తూ శర్మ పిటిషన్ దాఖలు చేసారు. సామాన్య ప్రజలపై పన్ను విధిస్తుండగా,  రాజకీయ పార్టీలు నూటికి నూరు శాతం ఆదాయ పన్ను మినహాయింపును ఎలా అనుభవిస్తున్నారంటూ పిటిషనర్ సవాలుచేశారు. 
 
పెద్ద నోట్ల రద్దు తర్వాత రాజకీయ పార్టీలకు వచ్చిన పెద్దనోట్ల డిపాజిట్లకు గాను వాటి ఖాతాలపే దర్యాప్తు చేయబోమని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి డిసెంబర్ 16న చేసిన ప్రకటన ఆధారంగా న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు.

ఆర్థిక శాఖ కార్యదర్సి ప్రకటన భారత పౌరులను ఆర్థిక పరంగా మరియు జీవనపరంగా పెద్ద దెబ్బతీస్తుందని, రాజకీయ పార్టీలకు నూరుశాతం పన్ను మినహాయింపును వెంటనే ఆపివేషి ఆ సెక్షన్లనే రద్దుచేయకపోతే మొత్తం సమాజానికి తీవ్ర ప్రమాదం కలుగుతుందని పిటిషన్‌దారు వాదించారు. 
 
రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాల దుర్వినియోగంపై చర్చ జరుగకుండా సుప్రీంకోర్టు కేవలం సాంకేతిక కారణాల ప్రాతిపదికన రాజకీయ పార్టీలకు పన్ను మినహాయింపును ఒకే చేయడం గమనార్హం.
 

వెబ్దునియా పై చదవండి