'నాకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని లేదు. నన్ను అవమానపరిచినా, పదవి నుంచి తొలగించినా పార్టీ కోసమే పనిచేస్తాను. పార్టీ శ్రేయస్సు కోసం రక్తాన్ని ధారపోయడానికి అయినా సిద్ధంగా ఉంటాన'ని సమాజ్వాదీ పార్టీ ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ అన్నారు.
లఖ్నవూలో జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పార్టీ రజతోత్సవ వేడుకలు చేసుకుంటుందంటే అందుకు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ త్యాగం, కృషే నిదర్శనమని ఆయన నేతాజీని కొనియాడారు. పార్టీ కోసం ఎటువంటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నానని, నేతాజీని అవమానపరిచేలా ఎవరు మాట్లాడినా సహించబోనని శివపాల్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, సీఎం అఖిలేశ్యాదవ్, జేడీయూ అధినేత శరద్యాదవ్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభ సమయంలో లాలూ.. అఖిలేశ్, శివపాల్ యాదవ్ చేతులు పట్టుకొని వారిద్దరినీ కలిపే ప్రయత్నం చేయగా, వెంటనే అఖిలేశ్.. బాబాయి శివపాల్ ఆశీర్వాదం తీసుకున్నారు.