మహిళలపై రేప్‌లను ఆపలేం.. ఇళ్లకు తాళాలేయమంటారా...?

గురువారం, 11 మే 2017 (15:55 IST)
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఆపడం ఎవరివల్లా కాదంటూ భాజపా నాయకుడు, రాజస్థాన్ మంత్రి కాళిచరణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. ఇటీవలే నగల దుకాణంలో పనిచేసే ఓ వ్యక్తి నగల దుకాణ యజమాని కుమార్తె పైన అత్యాచారం చేశాడు. దీనిపై మీడియా మంత్రిని ప్రశ్నలడిగింది. రాజస్థాన్ రాష్ట్రంలో రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయనీ, వీటిని మీరు ఎలా అడ్డుకుంటారంటూ మీడియా ప్రశ్నలు సంధించింది. 
 
విలేకరుల ప్రశ్నలతో మండిపడ్డ మంత్రి... అత్యాచారాలను ఆపడం ఎవరితరం కాదు అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. అంతేకాదు... అత్యాచారాలను ఆపాలంటే ప్రతి ఇంటికి తాళం వేస్తే సరిపోతుందనీ, ఆ పనిని చేయమంటారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా వారితో గొంతు కలిపాయి.

వెబ్దునియా పై చదవండి