త్వరలో రూ.100, రూ.10, రూ. 5 నోట్లు రద్దు?

శనివారం, 23 జనవరి 2021 (11:23 IST)
రూ.100, రూ.10, రూ. 5 నోట్లను మార్చి లేదా ఏప్రిల్‌ నాటికి నిలిపివేయాలని ఆర్‌బిఐ యోచిస్తున్నట్లు సమాచారం. రూ.100, రూ.10, రూ.5 పాత నోట్ల ముద్రణను ఆపేయబోతున్నట్లు ఆర్‌బిఐ అధికారులు వెల్లడించారు.

ముద్రణే కాదు... ప్రస్తుతం చెలామణీలో ఉన్న పాత సిరీస్‌ నోట్లు కూడా మార్చి, ఏప్రిల్‌లో చెలామణిలో లేకుండా చేస్తామని తెలిపారు. రూ. 10 నాణేలను ప్రవేశపెట్టి 15 సంవత్సరాలవుతున్న కూడా వ్యాపారులు, వాణిజ్యదారులు వాటిని విశ్వసించలేకపోతున్నారని, ఇది బ్యాంకులకు, ఆర్‌బిఐకి సమస్యగా మారిందన్నారు.

దీంతో బ్యాంకులో 10 రూపాయల నాణేలు పెద్ద యెత్తున పోగుపడ్డాయని అన్నారు. నాణేల చెల్లుబాటు గురించి వస్తున్న పుకార్లపై బ్యాంకులు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వాటిని ప్రజల్లో చెలామణి అయ్యేలా మార్గాలను అన్వేషించాలని కోరారు.

గతంలో మోడీ సర్కార్‌ పాత నోట్లు రద్దు చేసి అపఖ్యాతిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెద్దగా నోట్ల జోలికి పోలేదు. ఆ తర్వాత రూ. 200 లతో పాటు రూ.2 వేల నోట్ల ముద్రణ చేపట్టింది.

ఆ తర్వాత రూ.2000 నోటు ముద్రణను ఆపేసింది. తాజాగా... ఈ సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌ నాటికి పాత నోట్లను పూర్తిగా తొలగించబోతున్నట్లు ఆర్‌బిఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు