ప్రపంచాన్ని ఊపేస్తున్న "ఆర్ఆర్ఆర్" పాట.. "నాటు నాటు" పాటకు కొరియా సిబ్బంది స్టెప్పులు

ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (11:35 IST)
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. అయితే, ఈ చిత్రంలోని పాటలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదారణ పొందాయి. ముఖ్యంగా 'నాటు నాటు' పాట అత్యంత ఆదరణ పొందింది. దీంతో ఈ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. 
 
తాజాగా ఇపుడు భారత్‌లోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయ సిబ్బందికి కూడా ఈ ఫీవర్ పట్టుకుంది. ఈ రాయబార కార్యాలయ సిబ్బంది నాటు నాటు పాటకు తమదైనశైలిలో స్టెప్పులు వేశారు. ఈ వీడియోను ఎంబసీ అధికారులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
 
మొత్తం 53 సెకన్ల నిడివి కలిగిన ఈ క్లిప్‌లో దక్షిణ కొరియా రాయబార కార్యాలయ సిబ్బంది నాటు నాటు పాటలోని స్టెప్పులకు ఏమత్రం తీసిపోని విధంగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేసిన వారిలో దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే బోక్ కూడా చేరారు. 
 
టీమ్ మొత్తం పాటలోని హుక్ స్టెప్ కూడా వేసింది. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన కొద్దిసేపటికో 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ క్లిప్‌ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టిని కూడా ఆకర్షించింది. దీంతో ఆయన స్పందించి, సౌత్ కొరియా రాయబార కార్యాలయం చేసిన ప్రయత్నాన్ని ప్రశంసించారు.


 

 

వెబ్దునియా పై చదవండి