తీర్థయాత్రకు వెళ్లిన వ్యక్తి.. అతన్ని అనుసరిస్తూ 250 కిమీ వెళ్లిన శునకం!!

వరుణ్

బుధవారం, 31 జులై 2024 (11:11 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ ఆసక్తికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రంలోని ఓ వ్యక్తి తీర్థయాత్రలకు వెళ్లాడు. అయితే, ఆయన్ను అనుసరిస్తూ గ్రామంలోని ఓ శునకం వెళ్లింది. తీర్థయాత్రలకు వెళ్లిన యజమానిని అనుసరించిన ఓ కుక్క అక్కడ తప్పిపోయింది. చివరకు 250 కిలోమీటర్లు ప్రయాణించి యజమాని వద్దకు తిరిగొచ్చింది. కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తర కర్ణాటకలోని బెళగావికి చెందిన కమలేశ్ కుంభర్ ఏటా మహారాష్ట్రలోని పంధర్ పూర్‌కు 'వారి పాదయాత్ర'కు వెళుతుంటారు. జూన్ చివరి వారంలో బయలుదేరిన కమలేశ్‌నుగ్రామంలో ఉండే కుక్క కూడా అనుసరించింది. దాదాపు 250 కిలోమీటర్ల మేర కుక్క కమలేశ్ వెంట నడిచింది. విఠోబా గుడిలో దర్శన ముగించుకుని బయటకు వచ్చిన కమలేశ్‌కు కుక్క మాత్రం కనిపించలేదు. మరో భక్తజన బృందంతో అది వెళ్లిందని స్థానికులు చెప్పారు. శునకం కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో, ఆయన తిరిగొచ్చేశారు. అయితే, జులై 14న హఠాత్తుగా అది కమలేశ్ ఇంటిముందు ప్రత్యక్షమవడంతో ఆయన ఆనందానికి అంతేలేకుండా పోయింది.
 
కుక్కను చూసి గ్రామస్థులందరూ సంబరపడిపోయారు. ఆ కుక్క పేరు మహరాజ్ అని, దానికి భజనలు వినడమంటే ఇష్టమని కమలేశ్ చెప్పాడు. గతంలోనూ తన వెంట కొన్ని పాదయాత్రలకు కుక్క వచ్చిందని తెలిపాడు. వయసు మీద పడినా ఈ శునకం దాదాపు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెనక్కు రావడం నిజంగా అద్భుతమని స్థానికులు అంటున్నారు. కుక్క ఆరోగ్యంగానే ఉందని కూడా చెప్పారు. మహరాజ్ మళ్లీ తమ గ్రామానికి తిరిగొచ్చిన నేపథ్యంలో గ్రామస్థులు విందు కూడా ఏర్పాటు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు