దినకరన్ డబ్బుతోనే గెలిచారు.. కేసులను ఎదుర్కొనేందుకు రెడీ: కమల్ హాసన్

శనివారం, 6 జనవరి 2018 (18:06 IST)
చెన్నై, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లు.. తమ విలువైన ఓట్లను అంగట్లో సరకుల్లా అమ్ముకున్నారని.. ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆర్‌కే నగర్‌ ఓటర్లు రూ.20 టోకెన్లకు అమ్ముడు పోయారని, ఇది భిక్షమెత్తడం వంటిదేనని, ఇంతటి నీచమైన సంఘటన మరెక్కడైనా చూడగలమా అంటూ విరుచుకుపడ్డారు. 
 
ఓట్లను అమ్ముకున్న ఆర్కేనగర్ ప్రజలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చను మిగిల్చారని కమల్ హాసన్ ఏకిపారేశారు. తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కమల్ హాసన్ తేల్చి చెప్పారు. 
 
అయితే కమల్ హాసన్ వ్యాఖ్యలపై మండిపడిన టీటీవీ దినకరన్ వర్గీయులు.. కమల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఇక దినకరన్ వర్గీయుల బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని కమల్ తేల్చి చెప్పేశారు. ఈ విషయంలో కేసులు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. 
 
మలేషియాలో జరుగుతున్న నడిగర్ సంఘం స్టార్ నైట్ కార్యక్రమానికి వెళ్తూ వెళ్తూ చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్.. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో డబ్బు ప్రభావంతోనే దినకరన్ గెలిచారనే విమర్శలకు తాను కట్టుబడి వున్నానని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు