అవినీతి నేతల భరతంపట్టండి.. వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్...

శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (07:03 IST)
దేశంలో అవినీతి నేతల భరతం పట్టేందుకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. నిర్ధిష్ట కాలవ్యవధిలోగా కేసుల విచారణ పూర్తికావాల్సిందేనంటూ స్పష్టం చేసింది. ఇందుకోసం వారం రోజుల్లో ఓ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసి ఇవ్వాలని అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశించింది. 
 
దేశంలో అనేక మంది ప్రజాప్రతినిధులపై వివిధ రకాలైన అవినీతి కేసులు ఉన్నాయి. ఇవి ఏళ్ళ తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. అవినీతి కేసులు ఉన్న నేతలు దర్జాగా అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఇలాంటి వారి భరతం పట్టేందుకు సుప్రీంకోర్టు సమాయత్తమైంది. 
 
ఇందులోభాగంగా, ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. నిర్దిష్ట వ్యవధిలోగా కేసులను తేల్చాల్సిందేనని తెలిపింది. అవినీతి నేతల భరతం పట్టేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. 
 
ముఖ్యంగా, పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించి వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని హైకోర్టులకు సూచించింది. 9 అంశాలను యాక్షన్ ప్లాన్‌లో చేర్చాలని ఆదేశించింది.
 
ప్రతి జిల్లాలో ఉన్న పెండింగ్ కేసులు, ప్రత్యేక కోర్టుల సంఖ్య, అందుబాటులో ఉన్న కోర్టులు, జడ్జిల సంఖ్య, పదవీకాలం, ప్రతి జడ్జి ఎన్ని కేసులు పరిష్కరించగలరు, పరిష్కారానికి పట్టే సమయం, కోర్టుల మధ్య దూరం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివరాలను పొందుపరచాలని సూచించింది. 
 
స్టే ఉన్న కేసులను కూడా రెండు నెలల్లో ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పింది. అమికస్ క్యూరీ ఇచ్చిన సిఫారసులపై హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో అవినీతి నేతల గుండెల్లో గుబులు మొదలైందని చెప్పొచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు