బీజేపీకి సుప్రీంకోర్టు మరో షాక్ .. బలపరీక్షకు సిద్ధమన్న కాంగ్రెస్

శుక్రవారం, 18 మే 2018 (12:02 IST)
కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షకు సమయం కావాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. బల పరీక్షను శనివారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించాలని ఆదేశించింది.
 
ఇదే అంశంపై భారత అటార్నీ జనరల్ మాట్లాడుతూ బల పరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని సుప్రీంకోర్టును కోరారు. కానీ దీనిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్యేలు తమ చేతులుపైకి ఎత్తడం ద్వారా మద్దతు తెలియజేయాలని, ఎమ్మెల్యేల సంఖ్యను స్పీకర్ లెక్కించాలని తీర్పు చెప్పింది. 
 
మరోవైపు, ఏ క్షణమైనా అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని కాంగ్రెస్ - జేడీఎస్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసానికి తెలిపారు. దీంతో శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్షను నిర్వహించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
అంతకుముందు, సుప్రీంకోర్టులో ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టు రెండు ప్రత్యామ్నాయాలను తొలుత సూచన చేసింది. 24 గంటల్లో శాసనసభలో బల పరీక్ష, ప్రభుత్వ ఏర్పాటుపై సుదీర్ఘ విచారణ ... ఈ రెండిటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్‌లకు సుప్రీంకోర్టు సూచించింది.
 
పైగా, ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు పార్టీలు పొత్తు పెట్టుకున్నట్లు ప్రజలకు తెలియదు కదా? అని కాంగ్రెస్, జేడీఎస్‌లను ప్రశ్నించింది. ఈ రెండు ప్రయత్నామ్నాయాల్లో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని కాంగ్రెస్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వికి సుప్రీంకోర్టు సూచించింది. 
 
దీనిపై సింఘ్వీ స్పందిస్తూ శనివారం (రేపు) బల పరీక్షకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. బలపరీక్షకు వారం రోజుల సమయం కావాలని, బలపరీక్షను రహస్య ఓటింగ్ విధానంలో నిర్వహించాలంటూ బీజేపీ తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు