మిజోరంలో కొత్త వైరస్ కలకలం.. 4800 పందులు మృతి

బుధవారం, 2 జూన్ 2021 (11:01 IST)
ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో ఒకటైన మిజోరంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీంతో వందలాది పందులు మృత్యువాతపడుతున్నాయి. ముఖ్యంగా, ఇక్కడి పందుల్లో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ (ఏఎస్‌ఎఫ్‌) ప్రబలడంతో గత కొద్ది రోజులుగా అవి భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో 4,800 పందులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 
 
దీనివల్ల రాష్ట్ర రైతులకు దాదాపు రూ.19 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు ప్రకటించారు. మార్చి 21న లంగ్‌లై జిల్లా లంగ్‌సేన్‌ గ్రామంలో బయటపడిన ఈ వ్యాధి ప్రస్తుతం 9 జిల్లాలకు వ్యాపించింది. వీటి పరిధిలోని 91 గ్రామాలను స్వైన్‌ ఫీవర్‌ ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. 
 
ఇందులో ఒక్క ఆయ్‌జోల్‌ జిల్లాలోనే 55 గ్రామాలున్నాయి. స్వైన్ ఫీవర్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం 32 వేల పందులున్నాయి. అయితే ఈ వ్యాధి ప్రబలని ప్రాంతాల్లోనూ 100కు పైగా పందులు చనిపోయాయి. మిజోరంలో ఇలాంటి వ్యాధి ప్రబలడం ఇదే తొలిసారి. అయితే పందులను పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు